4.15 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యం సంయుక్త పాలనాధికారిణి వనజాదేవి పెద్దపల్లి కలెక్టరేట్, న్యూస్టుడే: జిల్లాలో వరి ధాన్యం సేకరణలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని సంయుక్త పాలనాధికారిణి వనజాదేవి పేర్కొన్నారు. ఈ ఏడాది 4.15 లక్షల మెట్రిక్ టన్నుల లక్ష్యంగా నిర్ణయించినట్లు వెల్లడించారు. వానాకాలంలో వరి ధాన్యం సేకరణపై పౌరసరఫరాలశాఖ కమిషనర్ అకున్ సబర్వాల్ నిర్వహించిన దూరదృశ్య మాధ్యమంలో పాల్గొన్నారు. అనంతరం సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో 45 మంది వ్యవసాయ విస్తరణ అధికారులను క్లస్టర్లుగా విభజించి నియమించామన్నారు. రైతులకు మద్దతు ధర చెల్లించేందుకు కొనుగోలు కేంద్రాలు నెలకొల్పుతున్నామని తెలిపారు. కోతలు ప్రారంభం నుంచే కేంద్రాలను ప్రారంభించాలన్నారు. సహకార, ఐకేపీ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాల్లో మౌలిక వసతులు కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ ప్రవీణ్, పౌరసరఫరాలశాఖ అధికారి వెంకటేశ్ పాల్గొన్నారు.
minute to minute updated news